Ram Charan: 'పెద్ది' రిలీజ్ వాయిదా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

Ram Charan: 'పెద్ది' రిలీజ్ వాయిదా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'.  ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.  ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు మరింత పెంచాయి. అయితే అనుకున్న సమయంలో ఈ మూవీ రిలీజ్ కావడంలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ పై మేకర్స్ మరొసారి క్లారిటీ ఇచ్చారు.

వదంతులకు క్లారిటీ..

వాస్తవానికి ఈ ' పెద్ది' సినిమా తొలుత మార్చి 27, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో చిత్ర యూనిట్ గతంలోనే దీనిని ఏప్రిల్ 30, 2026కు వాయిదా వేసింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందని, జూన్ 2026కు వెళ్లే అవకాశం ఉందంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు విన్న మెగా అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.  అయితే ఈ పుకార్లలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 30వ తేదీనే సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. చిత్ర బృందం షెడ్యూల్ ప్రకారం పని చేస్తోందని, అనుకున్న సమయానికే వస్తామని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. 

'రాయ్ రాయ్ రారా'.. మ్యూజికల్ ట్రీట్ సిద్ధం!

ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మొదటి పాట విశేషంగా అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి కళ్లు రెండో సింగిల్ “రాయ్ రాయ్ రారా”పై ఉన్నాయి. ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంటుందని సమాచారం. బుచ్చిబాబు తన సినిమాల్లో పాటలకు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి తెలిసిందే, దానికి తోడు రెహమాన్ మ్యాజిక్ తోడవ్వడంతో మ్యూజిక్ లవర్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

►ALSO READ | Shivani Nagaram: కాంట్రవర్సీలో చిక్కుకున్న లిటిల్ హార్ట్స్ హీరోయిన్.. తిరుమల వివాదంపై క్లారిటీ

భారీ తారాగణం 

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో హేమాహేమీలు నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు . సీనియర్ నటులు జగపతి బాబు, హాస్య నటుడు సత్య తమదైన నటనతో అలరించనున్నారు.

కథా నేపథ్యం

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని టాక్. వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. .  మొత్తానికి, 'పెద్ది' వాయిదా పడబోతుందనే వార్తలకు పుల్‌స్టాప్ పడటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే విడుదల కాబోయే రెండో సింగిల్ ద్వారా ఈ విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.