- కేంద్రం ఇచ్చింది మేం చెప్తాం.. రాష్ట్రం ఇచ్చింది నువ్వు చెప్పాలి
- మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ లీడర్లు నోరు అదుపులో పెట్టుకోవాలి
- బీజేపీ తలుచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరు
- కోహెడలో రైతుల భూములు గుంజుకున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే తమతో చర్చకు రావాలని, సెక్రటేరియెట్ గేట్ వద్ద తేల్చుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సవాల్ విసిరారు. ‘‘తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చర్చించేందుకు మేం సిద్ధం. తేదీ, సమయం నువ్వే చెప్పు.. సెక్రటేరియట్ గేట్ దగ్గరైనా సరే తేల్చుకుందాం” అని అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాంచందర్రావు మాట్లాడారు.
ఈ పదేండ్లలో కేంద్రం రూ.13 లక్షల కోట్లు ఇచ్చిందని, ఎయిమ్స్, కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ హైవేలు ఇలా అన్నీ లెక్కలతో సహా చెప్తామని, మరి మీ ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంచందర్రావు తప్పుబట్టారు. ‘పొలిమేర దాటనివ్వను’ లాంటి అహంకారపూరిత భాష వాడటం రేవంత్రెడ్డి స్థాయికి తగినది కాదన్నారు. సీఎం, కాంగ్రెస్ లీడర్లు నోరు అదుపులో పెట్టుకోవాలని, తమ కార్యకర్తలు తలుచుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. మజ్లిస్ సహవాసంతో కాంగ్రెస్కు నిజాం, రజాకార్ల భాష అలవాటైందన్నారు.
రైతు భూములు లాక్కోవడం దారుణం
కోహెడ ఫ్రూట్ మార్కెట్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని రాంచందర్రావు ఆరోపించారు. ఇది కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. సర్వే నంబర్ 167/1లో రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే భూములు స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం శంకుస్థాపనకు వస్తున్నారని రైతులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని పేర్కొన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చే వరకు మార్కెట్ పనులు మొదలు పెట్టనివ్వబోమని అన్నారు.
కేంద్రం ఇచ్చింది ఇగో ఇవి..
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీబీనగర్ ఎయిమ్స్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, 12 జాతీయ రహదారులులాంటివి కేంద్రమే ఇచ్చిందని రాంచందర్రావు గుర్తు చేశారు. ప్రజలకు అందుతున్న 5 కిలోల ఉచిత బియ్యం కూడా కేంద్రానివేనని చెప్పారు. కేవలం భూముల అమ్మకాలపైనే ఆధారపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు.
అవినీతి, కమీషన్ల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
