సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు మంగళవారం(ఫిబ్రవరి 13) ఆదేశించింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని, ఈనెల 27న ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఎస్పీని ఆదేశించింది.
ఏంటి ఈ కేసు..?
2019 లోక్సభ ఎన్నికల సమయంలో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. వీటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ సమయంలో ఆమెపై ఇప్పటివరకూ ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
జయప్రద ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. చెన్నై కోర్టు గతేడాది ఒక కేసులో జయప్రదను దోషిగా తేలుస్తూ 6 నెలల జైలు, రూ.5,000 జరిమానా విధించింది.