
- విలీనం వెనుక ఆస్తులను అమ్మే కుట్ర
- మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజం
హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై కపట ప్రేమ చూపుతున్నాడన్నారు. కేసీఆర్ కుట్రకు కార్మికులు బలికావద్దని ఆయన పిలుపునిచ్చారు. ‘గతంలో విలీనం సాధ్యం కాదని చెప్పిన కేసీఆరే ఇప్పుడు ఎన్నికల కోసం యూటర్న్ తీసుకున్నాడు. విలీనం కోరుతున్న పార్టీలకు అసలేం తెలియదంటూ ఎగతాళి చేశాడు.
ఇదే నిర్ణయాన్ని గతంలోనే తీసుకుంటే 38 మంది కార్మికులు చనిపోయేవారా?. ఆర్టీసీ బకాయిలపై సీఎం సమాధానం చెప్పడంలేదు. దీని వెనుక ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర ఉంది. కేసీఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేసింది కార్మికులు కాదు.. అదంతా స్థానిక ఎమ్మెల్యేల హడావిడి. సమ్మె విరమణ టైంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు. డీజిల్ పై ట్యాక్స్ ఎందుకు ఎత్తివేయడం లేదు. 2018లోనే మేం ఆర్టీసీ విలీనాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం’అంటూ రాములు నాయక్ వివరించారు.