స్కిల్ బేస్డ్ గేమ్నే ప్రమోట్ చేశా : దగ్గుబాటి రానా

స్కిల్ బేస్డ్ గేమ్నే  ప్రమోట్ చేశా : దగ్గుబాటి రానా
  • ‌‌‌‌‌‌ సీఐడీ అధికారులకు దగ్గుబాటి రానా వివరణ
  • ‌‌‌‌‌‌ యాంకర్ విష్ణుప్రియనూ విచారించిన సిట్​ 

హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్స్‌ కేసులో సీఐడీ సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధమున్న నటులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నించారు. 

ఇదే క్రమంలో శనివారం సీఐడీ సిట్‌ ఎదుట విచారణకు సినీ హీరో రానా దగ్గుబాటి, బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు. సిట్‌ అధికారుల సూచన మేరకు బ్యాంకు స్టేట్​మెంట్లతో హీరో రానా విచారణకు హాజరయ్యారు. 

బెట్టింగ్ యాప్ తో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. 2017లో బెట్టింగ్, అండ్ గేమింగ్ యాప్ ను రానా ప్రమోట్ చేశాడు. అయితే, తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, తన లీగల్‌ టీమ్​తో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ప్రమోషన్స్‌కు సంబంధించి ఒప్పందం చేసుకొన్నట్టు సీఐడీ అధికారులకు రానా వివరించినట్టు తెలిసింది. 

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ కేసు విచారణలో భాగంగా శనివారం యాంకర్ విష్ణు ప్రియను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మొత్తం మూడు బెట్టింగ్ యాప్స్ ను  విష్ణు ప్రియ ప్రమోట్‌ చేసినట్టు సీఐడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన సమన్ల మేరకు బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్​మెంట్ వివరాలను ఆమె సీఐడీ సిట్‌ అధికారులకు అందించారు.