జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్

జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్

ఎల్బీనగర్, వెలుగు: ఈ నెల14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ వినియోగించుకొని, కేసులను పరిష్కరించుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను రాజీ చేసుకోవాలని పేర్కొన్నారు. 

లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేస్తే కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసు లోక్ అదాలత్ కు పంపి, ఆ తర్వాత పరిష్కరించినట్లయితే కోర్టులో చెల్లించిన రుసుము కూడా పార్టీలకు తిరిగి ఇస్తారని చెప్పారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదా, డబ్బు రికవరీ, యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ తోపాటు ఇతర రాజీకి వీలున్న కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.