డీలర్లు ఐరిస్ కే ప్రయార్టీ ఇవ్వాలి: మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, వెలుగు: రేషన్ పంపిణీని ఈ నెలలో వారం రోజుల పాటు పొడిగిస్తున్నామని, 22వ తేదీ వరకు రేషన్ షాపులు ఓపెన్ ఉంటాయని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రేషన్ పంపిణీ చేపట్టాలని ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఐరిస్ కే ప్రాధాన్యం ఇవ్వాలని, ఐరిస్ పని చేయని వారికే మొబైల్ ఓటీపీ అమలు చేయాలన్నారు. ఒకవేళ మొబైల్ నంబర్ ఆధార్కు అనుసంధానం లేని వారు లింక్ చేసుకోవాలని సూచించారు. ఈ నెలలో ఇప్పటి వరకు 60 శాతం రేషన్ పంపిణీ ఐరిస్ ద్వారానే జరిగిందన్నారు. ఈ నెల 3 వరకే 11.33 లక్షల కార్డులకు రేషన్ పంపిణీ జరిగిందని, ఇది జనవరి నెల కంటే 3 లక్షల కార్డులు ఎక్కువేనని వివరించారు. సాధారణంగా ప్రతి నెల 15 వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల నుంచి రేషన్ పంపిణీకి ఐరిస్ లేదా ఓటీపీని కంపల్సరీ చేయడంతో కోటా అందుతుందో లేదోనన్న ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. రేషన్ పంపిణీని మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
For More News..