లింగంపేట, వెలుగు: మండలంలోని ఎల్లమ్మతండా, గాంధీనగర్ గ్రామాల్లో చిరుతపులి వరుసదాడులు చేస్తూ లేగదూడలను చంపుతోంది. ఈనెల 14న ఎల్లమ్మతండా సమీపంలో దెగావత్దేవిసింగ్కు చెందిన లేగదూడ ను చిరుత హతమార్చింది.19న గాంధీనగర్ సమీపంలో షేక్రజాక్ అనే రైతుకు చెందిన రెండు లేగదూడలను చంపేసింది.
శనివారం రాత్రి ఎల్లమ్మ తండా సమీపంలో సబావత్ సామ్నీకి చెందిన దూడను చిరుత చంపింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎఫ్డీవో రామకృష్ణ ఆదేశించినప్పటికీ బోను రిఫేర్అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రెండు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో..
సిరికొండ : మండలంలోని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తాటిపల్లి, జినిగ్యాల, చిమన్పల్లి, పందిమడుగు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో నర్సింగ్ రావు తెలిపారు. రుద్రంగి, మోత్కురావుపేట, సిరిసిల్లా, జగిత్యాల జిల్లా ఫారెస్ట్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో సంచరించే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
