
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం బుధవారం మొదలయింది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవుతుండటంతో, ఆర్బీఐ వరుసగా మూడోసారి కీలక రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు ద్రవ్య విధాన సమీక్షల్లోనూ ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) చొప్పున తగ్గించింది.
ఇప్పుడు ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగా ఉండటంతో, వృద్ధికి ఊతమిచ్చేందుకు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఈ రేట్ల తగ్గింపుతో హోం, వెహికల్స్, ఇతర లోన్లపై ఈఎంఐలు మరింత తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గుతాయి.