
ఆర్థిక వ్యూహంలో కీలకంగా నిలిచిన తాజా ద్రవ్య పరపతి నిర్ణయంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 5.50 శాతానికి తీసుకురావడం ద్వారా ఆర్థికవ్యవస్థలో ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేసింది. వరుసగా మూడోసారి వడ్డీ రేటు తగ్గించడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు తక్కువ స్థాయిలో కోతలు విధించిన తరువాత, ఈసారి గణనీయంగా తగ్గించి వృద్ధి లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరగడం, పెట్టుబడులకు ప్రోత్సాహం కలగడం వంటి అంశాలే కాకుండా, సామాన్య ప్రజలకు రుణభారం తగ్గించి ఆర్థిక భద్రతను అందించాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈఎంఐలు తగ్గడంతో హోం లోన్, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఊరటగా నిలవనుంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు రుణాలు మితమైన వడ్డీతో అందించగలిగితే వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇది ఉపాధి రంగానికీ కొత్త ఊపును ఇస్తుందని భావించవచ్చు. ఈ రేటు కోత వల్ల లిక్విడిటీ పెరిగి మార్కెట్లో డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశముంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించినట్లుగా.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని అంచనా వేయడమే కాకుండా, 2025-26 సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడం ఆశాజనకంగా ఉంది.
శ్రీనివాస్ గౌడ్ ముద్దం