లోన్​ రికవరీ ఏజెంట్లకు ఆర్​బీఐ వార్నింగ్​

లోన్​ రికవరీ ఏజెంట్లకు ఆర్​బీఐ వార్నింగ్​

న్యూఢిల్లీ: అప్పులు వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు వేధించడం, బెదిరించడం వంటి పద్ధతులను వాడటంపై ఆర్​బీఐ తీవ్రంగా స్పందించింది. కస్టమర్లను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్​ శక్తికాంత దాస్​ స్పష్టం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్​ చేసి అప్పు కట్టాలని అడగడం, బూతులు మాట్లాడటం వంటి పద్ధతులను సహించబోమని అన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘అర్థరాత్రి కూడా ఫోన్​ చేసి అప్పుకట్టాలని అడుగుతున్నారంటూ లోన్​ రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్లు అందుతున్నాయి. బూతులు మాట్లాడుతున్నారని సమాచారం వస్తోంది. ఇలాంటివి ఆమోదనీయం కాదు. ఫైనాన్షియల్​ సంస్థలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెగ్యులేటెడ్​ సంస్థలపై అయితే నేరుగా మేం చర్యలు తీసుకుంటాం. అన్​ రిజిస్టర్​ సంస్థలపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి”అని ఆయన అన్నారు. లోన్​ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. కస్టమర్లను ఇలాంటి సమస్యల నుంచి రక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వేధింపులను అడ్డుకోవడానికి ఇది సిఫార్సులు చేయనుంది.

డిజిటల్​ ఫైనాన్షియల్​ ప్రొడక్టులు, డిస్ట్రిబ్యూషన్​పైనా ఫోకస్​ చేస్తుంది. డిజిటల్​ లెండింగ్​పై డిస్కషన్​ పేపర్​ను విడుదల చేయనుంది. టెక్నాలజీ, డిజిటల్​ సర్వీసుల వాడకం ఎక్కువై సైబర్​ నేరాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఆర్​బీఐ వర్కింగ్​ గ్రూప్​ కొన్ని సిఫార్సులు చేసిందని, అవి పరిశీలనలో ఉన్నాయని శక్తికాంత దాస్​ తెలిపారు. ఇల్లీగల్​గా అప్పులు ఇస్తున్న 600 యాప్స్​ను కూడా గుర్తించిందని, వీటిపై సంబంధిత ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని వివరించారు. ఇట్లాంటి యాప్స్​ నుంచి అప్పులు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.