- షాద్ నగర్ ఆర్డీఓ వెంకట మాధవరావు
షాద్ నగర్,వెలుగు : ఓటరు జాబితా సవరణలో భాగంగా షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ వెంకట మాధవరావు తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
వచ్చే నెల 8న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక క్యాంపుల ద్వారా దరఖాస్తులు,అభ్యంతరాలు పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. తప్పుగా ఉన్న ఓటర్లను తీసి వేయడం, డబుల్ ఓట్లను గుర్తించడం జరిగిందని వెల్లడించారు.
డబుల్ ఓటుంటే నేరం
రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే అది నేరమని, చట్టరీత్యా చర్యలు ఉంటాయని, ఏడాది జైలు శిక్ష , ఫైన్ కూడా విధించే అవకాశం ఉందని ఫరూక్ నగర్ తహసీల్దార్ పార్థసారధి తెలిపారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారు డూప్లికేట్ ను వెంటనే తీసి వేయించుకోవాలని సూచించారు. ఫొటో ద్వారా టెక్నాలజీతో డూప్లికేట్ ఓట్లు తీసివేస్తున్నట్టు, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని పేర్కొన్నారు.
