ఇండియాపై ఇంకో యుద్ధానికి సిద్ధం.. ఆ 3 నదులనూ లాక్కుంటాం: బిలావల్ భుట్టో

ఇండియాపై ఇంకో యుద్ధానికి సిద్ధం.. ఆ 3 నదులనూ లాక్కుంటాం: బిలావల్ భుట్టో

చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో. కొన్ని వారాల కిందట భారత్ ఆపరేషన్ సిందూర్ కింద చేసిన దాడులతో పాక్ కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత జరిగినా అక్కడి రాజకీయ నాయకులు మాత్రం ప్రజలకు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకోవటం మానుకోలేదు. భారత దాడిలో చావుదెబ్బ తిన్న పాక్ మరోసారి యుద్ధానికి సై అనటం హాస్యాస్పదంగా మారిపోయింది. నీళ్లు ఆపితే డ్యామ్స్ పేల్చేస్తాం అంటూ గతంలో అక్కడి నాయకులు చేసిన వ్యాఖ్యలు మరువక ముందు మరోసారి బీరాలకు పోవటం చర్చనీయాంశంగా మారింది.

రక్తం నీరు ఒకేచోట ప్రవహించటం కుదరదంటూ భారత ప్రధాని ఒక్కముక్కలో సింధు జలాలపై తేల్చేసిన తర్వాత పాక్ తన ఉగ్రవాద వైఖరిని మార్చుకోకుండా నీళ్లు మాత్రం కావాలంటే లేఖలు రాస్తూ వచ్చింది. దీనికి భారత్ స్పందించకపోవటంతో కొత్త బెదిరింపులకు దిగింది. ఈసారి పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అసెంబ్లీలో మాట్లాడుతూ నీటి ఒప్పందాలను అమలు చేయకుంటే ఇండియాపై మరో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మెున్న జరిగిన యుద్ధంలోనూ తామే గెలిచామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 

సింధు జలాల కోసం యుద్ధానికి దిగితే భారత్ నుంచి మూడు నదులను లాక్కుంటామంటూ బెదిరించే ప్రయత్నం చేశారు బిలావల్ భుట్టో. అప్పుడు తమకు మూడు నదుల నుంచి కాకుండా ఆరు నదుల నుంచి నీరు వస్తుందంటూ గాల్లో లెక్కలు వేశారు. యుద్ధం దిశగా నీటి కోసం బలవంతం చేయబడితే.. పాక్ వైమానిక దళం, సైన్యం బలంగా ఉన్నాయని చెప్పారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని అంగీకరించి అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకోవాలి భుట్టో మరోసారి సూచించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడమే భారతదేశం ప్రయత్నమని అన్నారు. 

భారత్ అంతర్జాతీయ వేధికలపై కూడా పాక్ కి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. అయినప్పటికీ ఐఎంఎఫ్ నుంచి నిధులను పొందటంలో పాక్ విజయవంతమైందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తుందని భారతదేశం చెబుతున్నప్పటికీ తామే గెలిచామంటూ చెప్పటం గమనార్హం.