
- రూ.500కు సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్,
- ఇందిరమ్మ ఇండ్లు.. వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
- అర్హులెవరికీ నష్టం జరగొద్దు
- లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు
- గ్యారంటీలకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ
- తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లలో రెండింటిని తక్షణమే అమలుచేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, ఆరు గ్యారంటీలపై గురువారం సెక్రటేరియెట్లో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారం టీల్లో మరో రెండు గ్యారంటీలను వెంటనే అమలు చేద్దామని ఆయన అన్నారు.
వీటికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఒక్కో స్కీమ్ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ప్రయోజనం కలిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అయితే.. రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను వెంటనే అమలు చేసే అవకాశం ఉంది.
అర్హులెవరూ నష్టపోవద్దు
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఐదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని జనవరి 12 నాటికే రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని వివరించారు.
అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు సరి చూడాలన్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హోం శాఖ సెక్రటరీ జితేందర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.