అమరులను, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను మరిచిన్రు

అమరులను, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను మరిచిన్రు
  • వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎట్లొచ్చినయ్? 
  • జలదృశ్యంలో మొదలైన టీఆర్​ఎస్  అవినీతి దృశ్యంగా మారింది 
  • ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం ప్లీనరీ దగ్గర తెలుగు తల్లి విగ్రహం పెట్టిన్రు
  • అమరులను, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను మరిచిన్రు
  • ఏడున్నరేండ్ల పాలన పై చర్చకు సిద్ధమా..?: రేవంత్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ఇరవయ్యేండ్ల కింద ఉద్యమ ఆకాంక్షలతో జలదృశ్యంలో పుట్టిన టీఆర్​ఎస్​  నేడు అవినీతి దృశ్యంగా మారిపోయిందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి విమర్శించారు. పెద్దగా వనరులు లేక కొండా లక్ష్మణ్​ బాపూజీ ఇంట్లో నాడు ప్రారంభమైన పార్టీకి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఉన్నాయని, ఇవన్నీ ఎట్లా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కేసీఆర్​ ఎదిగారని, పార్టీ ఆఫీసుల పేరిట వెయ్యి కోట్లు కూడగట్టారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్​లో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. నిజాం నవాబులను తలదన్నేలా కేసీఆర్ వారసులు తయారయ్యారని దుయ్యబట్టారు. టీఆర్​ఎస్​ పార్టీకి రూ. 420 కోట్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లు ఉన్నాయంటే వారి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనన్నారు. పార్టీ ఇరవయ్యేండ్లు పూర్తి చేసుకుందని ఏర్పాటు చేసుకున్న ప్లీనరీలో కనీసం అమర వీరులను స్మరించుకోలేదని, టీఆర్​ఎస్​ ఎదుగుదలకు తోడ్పడిన నేతల పేర్లను కూడా వేదిక మీద కేసీఆర్​ ప్రస్తావించలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్​ జయశంకర్​ మొదలుకొని ఎందరో మహానుభావులను కేసీఆర్​ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని.. కొండా లక్ష్మణ్​ బాపూజీ, బియ్యాల జనార్దన్​ రావు, కేశవరావ్​ జాదవ్​, గూడ అంజయ్య, ఆలె నరేంద్ర, విద్యాసాగర్​ రావు లాంటి వాళ్లను కనీసం తలుచుకోలేదని అన్నారు. పార్టీ ఎదుగుదల కోసం పని చేసిన నేతలు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, విజయరామారావు, రవీంద్రనాయక్​, చెరుకు సుధాకర్​, స్వామిగౌడ్​ లాంటి వాళ్ల పేర్లను గుర్తు చేసుకోలేదన్నారు. 
తెలుగు తల్లి విగ్రహం పెట్టిన్రు
టీఆర్​ఎస్​ ప్లీనరీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు తెలుగు తల్లి విగ్రహం పెట్టారని రేవంత్​ అన్నారు. తెలుగు తల్లి ఎవరికిరా తల్లి అని కేసీఆర్​ అప్పట్లో అనేవారని ఆయన గుర్తుచేశారు. ‘‘ప్లీనరీకి  ఆంధ్రా కాంట్రాక్టర్లు పెట్టుబడులు పెట్టారని, తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసి వాళ్లను సంతృప్తి పరిచినట్లున్నరు” అని వ్యాఖ్యానించారు.  కేసీఆర్​, కేటీఆర్​ ఇద్దరు బొమ్మల్ని మాత్రమే ప్లీనరీలో పెట్టుకున్నారని, ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్​ సాధించిందేమీ లేదని విమర్శించారు. ఏడున్నరేండ్ల పాలనపై తాను చర్చకు సిద్ధమని రేవంత్​ సవాల్​ విసిరారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, స్టూడెంట్లు స్కాలర్​షిప్​ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియాకు ఎంత నిధులు కేటాయించారో చర్చిద్దామా అని డిమాండ్​ చేశారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో లక్షా ఏడు వేల ఖాళీలున్నాయని కేసీఆర్​ చెప్పారని, బిశ్వాల్​ కమిటీ కూడా లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంత కలిసి పోరాటం చేస్తే రాష్ట్రం సాకారమైందని,  ఇప్పుడు కేసీఆర్​ ఆ వర్గాలందర్నీ దూరం పెట్టారని ఆయన మండిపడ్డారు. పోరాట సమయంలో పెట్టిన కేసుల్ని ఇంత వరకు తొలగించలేదని.. కవిత, కేసీఆర్​, కేసీఆర్​పైన ఉన్న కేసుల్ని మాత్రం తొలగించుకున్నారన్నారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదని విమర్శించారు. పవర్​ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, రాష్ట్రం ఆదుకుంటే తప్ప ఈ సంస్థలు గట్టెక్కవని ఆ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​ రావు ఒక రిపోర్ట్​ ఇచ్చారని,  కేసీఆర్​ దాన్ని చెత్త బుట్టలో వేశారని అన్నారు. ప్రభాకర్​ రావు కొంత కాలంగా కనిపించడం లేదని, ఆయన ఎక్కడికి పోయారో కేసీఆర్​ చెప్పాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. ఒక ఉద్యోగి ఇన్ని రోజులు కనిపించకుండా పోతే ఎట్లా ఊరుకుంటారని ప్రశ్నించారు. ట్రాన్స్​ కో, జెన్​కోల ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.