ముగ్గురు పిల్లల మృతికి కారణమెవరు.. తప్పెవరిది?

ముగ్గురు పిల్లల మృతికి కారణమెవరు.. తప్పెవరిది?

ఫిట్​నెస్​ లేని బస్సు..
పర్మిషన్​ లేని హాస్టల్..
అనుమతి ముగిసిన స్కూల్

పట్టించుకోని అధికారులు

వేములవాడ, వెలుగు: వాగేశ్వరి స్కూల్​ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఓ టెన్త్​ స్టూడెంట్​ ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాలు ఆవేదనలో మునిగిపోయాయి. ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. మరి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమెవరు, తప్పెవరిది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.​ ఓ కమర్షియల్​ కాంప్లెక్స్​లోని నాలుగో అంతస్తులో స్కూల్​ నిర్వహిస్తున్నారు. హాస్టల్​కు అసలు ఏ అనుమతీ లేదు.. బస్సుకు ఫిట్​నెస్ లేదు.

పర్మిషన్ గడువు ముగిసినా..

వాగేశ్వరి స్కూల్​లో ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ (ఒకటి నుంచి ఏడో తరగతి వరకు)లకు పర్మిషన్​ లేదు. ఇంతకుముందు ఇందులో చైతన్య, వాగేశ్వరి రెండు స్కూళ్లు ఉండేవి. వాటిని కలిపేసి వాగేశ్వరి పేరిటే కొనసాగిస్తున్నారు. అప్పర్​ ప్రైమరీ వరకు అనుమతి ఈ ఏడాది జూన్​లోనే ముగిసింది. రెన్యువల్ కోసం స్కూల్​ మేనేజ్​మెంట్​ దరఖాస్తు చేసుకుంది. కానీ స్కూల్​ నిబంధనల మేరకు లేదంటూ స్థానిక ఎంఈవో ఆ ఫైల్​ను పెండింగ్​లో పెట్టినట్టు తెలిసింది. ఇలా అనుమతి లేకున్నా వాగేశ్వరి యాజమాన్యం క్లాసులు నిర్వహిస్తోంది. బుధవారం ప్రమాదంలో మరణించిన ముగ్గురు స్టూడెంట్లలో ఇద్దరు ప్రైమరీ స్కూల్​(2వ తరగతి) వాళ్లే. ఇక స్కూల్​ పిల్లలు ఉంటున్న హాస్టల్​కు కూడా అనుమతి లేదు. ఊరి శివార్లలో రేకుల రూములు కట్టి హాస్టల్​గా నిర్వహిస్తున్నారు.

స్కూల్​ బస్సుకు ఫిట్ నెస్ లేదు..

ప్రమాదానికి గురైన మినీ బస్సు ఫిట్ నెస్​ లేదు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా రవాణా అధికారి కొండల్​రావు ధ్రువీకరించారు. అసలు ఈ వెహికిల్​ కండిషన్​లో లేకపోవడం, ఇన్సూరెన్స్​ కూడా లేకపోవడంతో ఫిట్​నెస్​ కోసం రాలేదని తెలిసిందని చెప్పారు.