మంచిర్యాలలో హత్యకు కారణాలేంటీ.. ఎంతమంది చంపారు.. ఎందుకు చంపారు..

మంచిర్యాలలో హత్యకు కారణాలేంటీ.. ఎంతమంది చంపారు.. ఎందుకు చంపారు..

తెలంగాణలో భయానక ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాలలో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తిని యువతి కుటుంబం అందరూ చూస్తుండగానే పట్టపగలే బండరాయితో కొట్టి చంపేసింది. పలుమార్లు ఆ యువకుడి తలపై కొట్టి చిధ్రం చేసిన యువతి కుటుంబసభ్యులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వీడియోలో రికార్డయింది. ఈ అత్యంత భయానకరమైన ఘటన జైపూర్ మండలం ఇందారంలో చోటుచేసుకుంది.

ఎందుకు హత్య చేశారు..?

పెళ్లయిన ఆ యువతికి మహేశ్ గత కొన్ని రోజుల క్రితం అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టి వేధిస్తున్నాడంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆ కుటుంబం ఫిర్యాదు చేసినప్పటికీ మహేశ్ మాత్రం నిరంతరం అలాగే మెసేజ్ లు పంపిస్తుండడం ఆ కుటుంబసభ్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ కుటుంబం యువకుడిని బండరాయితో చితకబాదింది. అందరూ చూస్తుండగా మహేశ్ చనిపోయే వరకు పలు మార్లు తలపై  బాది, అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాపాడండి.. కాపాడండి అంటూ మహేశ్ ఆర్తనాదాలు పెట్టినా, వేడుకున్నా యువతి కుటుంబసభ్యులు ఏ మాత్రం కనికరం లేకుండా అత్యంత పాశవికంగా చంపేసిన ఈ ఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది.

ఈ సమయంలో ఆ వీధిలో ఉన్నవారంతా చూస్తూ ఉండిపోయారే తప్ప, ఆ ఘటనను అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. సెల్ ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరిస్తూ అలా చూస్తూండిపోయారే తప్ప ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఘటన జరిగిన అనంతరం చుట్టుపక్కల ఉన్న కొంతమంది100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత దాదాపు 30నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.

ఎక్కడ, ఎలా జరిగింది.. ?

మహేశ్ బండిపై వెళుతున్న సమయంలో.. యువతి కుటుంబం ఇళ్లు దాటి వీధి దాటుతున్న సందర్భంలో పెద్దపల్లి కనకయ్య అనే యువతి కుటుంబసభ్యుడు ఆపి, అతనితో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. ఆ తర్వాత కుటుంబంలోని మిగతా వాళ్లు వచ్చి మహేశ్ పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను బట్టి చూస్తే.. బండిపై వెళుతున్న మహేశ్ ను లాగి, కిందపడేసి, బండరాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది.

పోలీసులు ఏం చెబుతున్నారంటే..

ఘటన అనంతరం చేరుకున్న పోలీసులు.. మహేశ్ కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీధిలో హత్యను చూసిన వారెవరూ కూడా ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాలు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా సమయంలో వీడియోను రికార్డు చేసిన వారి నుంచీ పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

స్థానికులు..

ఈ ఘటనపై స్థానికులు ఎలాంటి విషయాలను వెల్లడించడం లేదు. కనకయ్య అదే వీధికి చెందిన వ్యక్తి కావడంతో.. చెప్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వారంతా భయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం గతంలో ఈ రెండు కుటుంబాలకు సంబంధించి పలు గొడవలున్నాయని, కానీ ఇంతకుమునుపు ఎప్పుడైనా ఫోన్లలో మాట్లాడుకుని వాదించుకునేవారని తెలుస్తోంది. అయితే మహేశ్ ను హత్య చేయడం వెనుక ఈ అసభ్యకరమైన మెసేజ్ లను పంపడమే ముఖ్య కారణమా.. లేదంటే ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

హంతకులు ఎక్కడ..?

హత్యకు పాల్పడిన యువతి కుటుంబసభ్యులు ప్రస్తుతం ఇప్పుడెక్కనున్నారన్న విషయం మాత్రం తెలియరావడం లేదు.