
- సర్వీస్ రూల్స్ రూపొందించేపనిలో అధికారులు
- ఇప్పటికే 1,523 పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చిన ఆర్థిక శాఖ
- అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని70 శాతం ఖాళీలు ప్రమోషన్లతో భర్తీ
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో కొత్తగా భర్తీ చేస్తామని ప్రకటించిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల రిక్రూట్మెంట్కు బ్రేక్ పడింది. ఇప్పటికే 1,523 పోస్టులు నింపేందుకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, తొలిసారిగా ఆ పోస్టులు భర్తీ చేయనుండటంతో, వాటికి సంబంధించిన సర్వీస్ రూల్స్ తయారు చేసే పనిలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉన్నారు. దీంతో స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడినట్లయింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ స్కూళ్లలో ఆటిజం, బుద్ధిమాంద్యత, మాస్క్యూలర్ డిస్ట్రోఫీ వంటి మానసిక వైకల్యాలతో బాధపడుతున్న స్టూడెంట్లకు స్పెషల్ టీచర్లను నియమించేందుకు గతంలోనే సర్కారు నిర్ణయించింది. ప్రతి పది మంది స్టూడెంట్లకు ఒకరు చొప్పున.. మొత్తం 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టులు మంజూరు చేసింది. ప్రైమరీ స్కూళ్లలో 796, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 727 పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే, జనరల్ టీచర్ పోస్టులతో పాటే ఈ పోస్టులనూ భర్తీ చేస్తామని గతంలో వెల్లడించింది.
ఐఈఆర్పీలకు వెయిటేజీ..?
ప్రస్తుతం మంజూరు చేసిన వాటిలో ఎస్జీటీ పోస్టులు 796 ఉండగా, వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో భర్తీ చేయబోయే 727 పోస్టుల్లో మాత్రం నిబంధనల ప్రకారం 70% పోస్టులను ప్రమోషన్ల ద్వారా నింపుతారు. మిగిలిన 30% పోస్టులే రాతపరీక్ష ద్వారా రిక్రూట్ చేస్తారు. ప్రస్తుతం ఎస్జీటీల్లో స్పెషల్ బీఈడీ చేసిన టీచర్లుంటే, వారికి ప్రమోషన్లతో ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు.
మరోపక్క ప్రస్తుతం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐఈఆర్పీ (భవిత) కేంద్రాల్లో పనిచేస్తున్న 1,200 మంది కాంట్రాక్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్లు (ఐఈఆర్పీ)లకు డీఎస్సీలో వెయిటేజీ ఇచ్చే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. 5 నుంచి 10% వెయిటేజీ ఇచ్చే ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నది. ఆ తర్వాతే, స్పెషల్ టీచర్ల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది.