తహసీల్దార్లను పాత జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలె
రెవెన్యూ ఉద్యోగ సంఘాల మీటింగ్ లో నేతల డిమాండ్
రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, తహసీల్దార్లను వెంటనే పాత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులపై పెరిగిన పనిభారం, ఒత్తిడిపై చర్చించేందుకు ఆదివారం సికింద్రాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదని, ఉద్యోగులు బదిలీలకు నోచుకోక ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఆత్మహత్యకు పాల్పడినవారిలో జ్వాలా గిరిరావుతోపాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఐదు తీర్మానాలు చేశారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం- రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, టీజీటీఏ అధ్యక్షుడు ఎస్.రాములు, టీవీఆర్వో సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికె ఉపేందర్రావు, టీవీఆర్వోఏఏ అధ్యక్షుడు ఎన్.లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.సుదర్శన్, టీజీటీఏ ముఖ్య సలహాదారు ఎండీ.సలీముద్ధీన్, టీవీఆర్ఏ ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు పాల్గొన్నారు.
నేడు రెవెన్యూ ఉద్యోగుల సంస్మరణ సభ
రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన, వివిధ కారణాలతో మరణించిన ఉద్యోగుల సంస్మరణ సభను సోమవారం సికింద్రాబాద్లో నిర్వహించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం నిర్ణయించింది. ఈ సంతాప సభకు విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. సభకు అన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరై నివాళులర్పించాలని కోరారు.