- సరుకులు కొనుక్కోవడానికి 4 గంటలపాటు వెసులుబాటు
కరీంనగర్లో కరోనా కలకలం మార్చి 16న మొదలైంది. ఇండోనేషియా వాసులు పది మంది ఢిల్లీమర్కజ్కు వెళ్లి ఇక్కడికి రావడం, వారిలో కరోనా లక్షణాలు బయట పడడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. వారిని హైదరాబాద్ తరలించి,స్థానికంగా ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారో గుర్తించారు. వీరు తిరిగిన కశ్మీర్ గడ్డ, ముకరంపుర ప్రాంతాలను 18వ తేదీ నుంచి నో మూవ్మెంట్ జోన్లుగా ప్రకటించారు. టెస్టుల్లో ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటివ్గా తేలడంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 3700 ఇళ్లు, 15 వేల జనాభాలో ఎవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉంటున్న వారికి అవసరమైన నిత్యావసర సరుకులు ఇంటికే పంపించారు. ప్రైమరీ కాంటాక్ట్ లను కాంటాక్ట్ గుర్తించి క్వారంటైన్ చేశారు.
19 నుంచి రెండుకు..
ఇండోనేషియా వాసులే కాకుండా ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కూడా ఒక్కొక్కటి గా వెలుగు చూశాయి. కేసుల సంఖ్య ఈ నెల 15 నాటికి 19కి చేరింది. ఆఫీసర్లు రెగ్యులర్గా సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయడం, లాక్డౌన్ను పక్కాగా అమలు చేయడంతో మెల్లమెల్లగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. వీరిలో 17 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
నెల రోజుల తర్వాత..
పరిస్థితి కుదుటపడడంతో నెల రోజుల తర్వాత నో ఎంట్రీ జోన్లో ఉన్న ప్రాంతాల్లోని ఆంక్షలను పాక్షికంగా సడలిస్తూ ఆదివారం బారికేడ్లు తెరిచారు. వీరందరికి నాలుగు గంటల పాటు బయటకువెళ్లి కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడానికి వీలు కల్పించారు. మిగిలిన రోజులలో మరో గంట చొప్పున పెంచుతూ సడలింపు చేయనున్నారు. ఈ కాలనీల్లోని బారికేడ్ల దగ్గర మెడికల్ టీమ్లను ఏర్పాటు చేశారు. బయటకు వెళ్లివచ్చిన కాలనీవాసులను ఈ టీమ్లు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాయి. ఎవరైనా అనుమానితులు ఉంటే ఈ పరీక్షల్లో తేలుతారని జిల్లాయంత్రాంగం భావిస్తోంది.
అత్యవసరమైతేనే..
ఆంక్షల సడలింపులో అత్యవసర పనులు, నిత్యావసర సరుకులు కొనుగోలుకు మాత్రమే బయటకు రావాలని అధికారులు పక్కాగా చెప్పారు. అనవసర విషయాలకు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రకంగానైనా దీంతో ఈ రెండు ప్రాంతాల వారికి కొంత ఊరట లభించింది. నెల రోజుల పాటు ఇందులో 75 శాతం మంది బయటకు రాలేకపోయారు. ఇప్పుడి ప్పుడే బయటకు రావడంతో వారి ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. కంటైన్ మెంట్ జోన్లు ఎత్తేయాలని పలు మార్లు పలురకాలుగా ఒత్తిడి వచ్చినా, అధికారులు మాత్రం కట్టుదిట్టంగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలిగారు.