న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నాఫ్తా సహా పలు రిఫైన్డ్ ఫ్యూయల్స్ను రష్యా నుంచి కొంటోంది. యూరప్ సహా చాలా దేశాలు రష్యన్ ఆయిల్ దిగుమతులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై దాడి చేయడంతో రష్యాపై అమెరికా, ఈయూ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యన్ క్రూడాయిల్, రిఫైన్డ్ ఫ్యూయల్స్ను చాలా దేశాలు కొనడం లేదు. పెట్రోకెమికల్స్ తయారీకి ఉపయోగించే 4,10,000 టన్నుల నాఫ్తాను భారతదేశం ఈ ఏడాది సెప్టెంబరు-–-అక్టోబర్లో దిగుమతి చేసుకుంది. రిలయన్స్ ఈ రెండు నెలల్లో రష్యాలోని ఉస్ట్-లూగా, టుయాప్సే, నోవోరోసిస్క్ ఓడరేవుల నుండి దాదాపు 1,50,000 టన్నుల నాఫ్తాను అందుకున్నది.
ఈ ప్రైవేట్ రిఫైనర్ 2020, 2021 సంవత్సరాల్లో రష్యన్ నాఫ్తాను కొనుగోలు చేయలేదు. ఆంక్షల వల్ల పుతిన్ ప్రభుత్వం నాఫ్తా అమ్మకాల కోసం ఇతర కొనుగోలుదారుల కోసం వెతుకుతోందని మనదేశానికి చెందిన ఒక ఇండస్ట్రియలిస్టు అన్నారు. రష్యన్ నాఫ్తాను భారతదేశం వంటి దేశాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రెండు రిలయన్స్ ప్లాంట్లు రోజుకు 1.4 మిలియన్ బారెల్స్ చమురును ప్రాసెస్ చేస్తాయి. ఇరాక్, రష్యాతో సహా పలు దేశాల నుండి నేరుగా చమురును కూడా కొనుగోలు చేస్తున్నది. ఇదిలా ఉంటే ఇక నుంచి కూడా రష్యా నుంచి చమురును కొంటామని కేంద్రం ప్రకటించింది.