ములుగు, వెలుగు : హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీది అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర అని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగులోని లీలా గార్డెన్లో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్తోపాటు మంత్రి సీతక్క ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన బీజేపీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైలులో పెడుతోందన్నారు.
జీఎస్టీ తీసుకువచ్చి పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రూ.54 లక్షల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. ప్రతి ఏడాది ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని, జన్ధన్ఖాతాల్లో రూ.15 లక్షలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలతోపాటు రూ.10లక్షల ఉచిత జీవిత బీమా ఇస్తామన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు పార్టీ చేరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు.
గడ్డపార పట్టి మట్టి తవ్వి...
వెంకటాపూర్(రామప్ప) : ములుగు, బండారుపల్లితోపాటు వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్, కేశవాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ సందర్భంగా గడ్డపారతో మట్టి తవ్వారు. సీతక్క మాట్లాడుతూ ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు.