మళ్లీ అంబానీయే నం.1.. ఇండియాలో రిచెస్ట్​ పర్సన్​

మళ్లీ అంబానీయే నం.1.. ఇండియాలో రిచెస్ట్​ పర్సన్​

న్యూఢిల్లీ: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ చైర్మన్​ ​ముకేశ్​ అంబానీ రికార్డులకు ఎక్కారు. ఈ విషయంలో ఆయన అదానీ గ్రూపు సంస్థల బాస్​ గౌతమ్​ అదానీని వెనక్కి నెట్టారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం.. అంబానీ సంపద 2014లో రూ.1,65,100 కోట్ల నుంచి ఈ ఏడాది నాటికి దాదాపు రూ.8,08,700 కోట్లకు.. అంటే నాలుగు రెట్లు పెరిగింది. 

హురున్ ఇండియా.. 360 వెల్త్ తో కలిసి ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ని విడుదల చేసింది. దీని ప్రకారం.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రెండవ స్థానానికి పడిపోయారు. హిండెన్​బర్గ్​ఇచ్చిన రిపోర్టు కారణంగా ఆయన సంపద చాలా తగ్గి రూ.4,74,800 కోట్లకు పడిపోయింది. దీంతో ఆయన రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదానీ సంస్థ స్టాక్​ మానిప్యులేషన్​, మనీలాండరింగ్​ వంటి అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన షార్ట్​సెల్లింగ్​ సంస్థ హిండెన్​బర్గ్​ ఆరోపించడంతో ఆయన కంపెనీల స్టాక్స్​ విపరీతంగా నష్టపోయిన విషయం తెలిసిందే. 

సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా అధిపతి సైరస్​ పూణావాలా 2023 నాటికి మొత్తం రూ.2,78,500 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఈయన కంపెనీ కరోనా వ్యాక్సిన్​ తయారు చేసి భారీగా సంపాదించింది.  హెచ్​సీఎల్​ టెక్ ​శివ్ నాడార్ రూ.2,28,900 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో, గోపీచంద్ హిందూజా కుటుంబం రూ.1,76,500 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. సన్​ఫార్మా ఫౌండర్​ దిలీప్​ షాంఘ్వీ1,64,300 కోట్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. 

ఆర్సెలార్​ మిట్టల్​ ఎగ్జిక్యూటివ్​ చైర్మన్ ​లక్ష్మీ నివాస్​ మిట్టల్ కుటుంబం రూ.1,62,300 కోట్ల సంపాదనతో ఏడవ స్థానంలో ఉంది. డీమార్ట్​ పేరుతో రిటెయిల్​ స్టోర్లు నడిపే రాధాకిషన్ దమానీ  కుటుంబం రూ.1,43,900 కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉంది.  కుమార మంగళం బిర్లా  ఫ్యామిలీ  రూ.1,25,600 కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో,  రూ.1,20,700 కోట్ల నెట్​వర్త్​తో  నీరజ్ బజాజ్  ఫ్యామిలీ వరుసగా పదో స్థానాల్లో ఉన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. 
గత ఏడాదితో పోలిస్తే 38 మంది పెరిగారు.

 "ఇండియాలో 1,319 మంది వ్యక్తుల చేతుల్లో ఇప్పుడు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉంది. గత ఐదేళ్లలో ఇది 76 శాతం పెరిగింది. మా లిస్టర్ల పూర్తి సంపద రూ.109 లక్షల కోట్లకు పెరిగింది. ఇది యూఏఈ,  సౌదీ అరేబియా, సింగపూర్ జీడీపీ కంటే ఎక్కువ!  ఇండియాలో ఎంట్రప్రిన్యూరియల్​ స్పిరిట్​కు కొదవ లేదు. ఈ లిస్టులోని 64 శాతం మంది వ్యక్తులు సొంతగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు”అని అని 360 వన్​ కో–ఫౌండర్​ యతిన్ షా తెలిపారు.