న్యూఢిల్లీ : మనదేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇది పెట్రోకెమికల్స్ నుంచి న్యూ ఎనర్జీ వరకు... అన్ని వర్టికల్స్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఇందుకోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (జీఈటీ) 2024 ప్రోగ్రామ్ పేరుతో ఎంట్రీ-లెవల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది.
ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ జనవరి 11 నుంచి ప్రారంభమైందని, జనవరి 19 వరకు ఉంటుందని సంస్థ తన వెబ్సైట్లో తెలిపింది. ప్రతి యువ ఇంజినీరింగ్ స్టూడెంట్కు సమాన అవకాశాలను అందించడానికి జీఈటీ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. చిన్న పట్టణాల వాళ్లకు, టాప్ 50 లేదా 100 ఇన్స్టిట్యూట్లకు చెందిన యువకులకు రిలయన్స్లో ప్రపంచస్థాయి శిక్షణ, ఉపాధి అవకాశాలు ఇస్తారు.
ఈ కార్యక్రమం కింద, రిలయన్స్ బీటెక్, బీఈ స్టూడెంట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏఐసీఈటీ -ఆమోదిత సంస్థల నుంచి కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి వివిధ స్ట్రీమ్లకు చెందిన 2024 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు ఫిబ్రవరి 5–8 కాగ్నిటివ్ టెస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలకు రావాలి. మార్చిలోపు ఉద్యోగాలు ఇస్తారు.