
ప్రస్తుతం అనిల్ అంబానీ అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మారారు. ఎందుకంటే దాదాపు దశాబ్ధానికి పైగా వినిపించని ఆయన కంపెనీల పేరు ప్రస్తుతం మార్కెట్లో మారుమోగుతోంది. ఆయన ఏం చేసినా కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాపారాలు నష్టాల నుంచి కోలుకుని మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా తిరిగి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయి.
నేడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంట్రాడేలో ఈ స్టాక్ ధర ఏకంగా 12 శాతం పెరిగి రూ.72.26ని తాకాయి. దీంతో దాదాపు 10 ఏళ్ల గరిష్ఠాలను తాకింది. వాస్తవానికి నంబర్ 2014 తర్వాత ఆ స్థాయికి మళ్లీ కంపెనీ షేర్లు పెరగి రూ.70 మార్కుకు పైన ట్రేడింగ్ కొనసాగించటంతో ఇన్వెస్టర్ల దృష్టి ఈ కంపెనీ షేర్లపై కొనసాగుతోంది.
ఇటీవలి వారాల్లో కంపెనీకి కోర్టు నుంచి అనుకూలంగా వచ్చిన తీర్పులతో పాటు కొత్త ప్రాజెక్టులను గెలుచుకోవటం, మూలధనం పెంపు, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఉత్తమ పనితీరు వంటి అనేక కారణాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో చాలా మంది కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. దీంతో మే నెలలో కంపెనీ షేర్లు 45 శాతానికి పైగా లాభపడగా.. గతవారంలో 20 శాతం పెరుగుదలను చూశాయి. అలాగే గత నెల కంపెనీ అనుబంధ సంస్థ ఆసియాలో అతిపెద్ద సోలార్ అండ్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
రిలయన్స్ పవర్ క్యూ4 ఫలితాలు..
రిలయన్స్ పవర్ నాల్గవ త్రైమాసికంలో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ కాలంలో రూ.126 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది కిందట ఇదే సమయంలో కంపెనీ రూ.397.56 కోట్ల నికర నష్టాన్ని చూపించింది. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ మెుత్తం ఆదాయం రూ.2వేల 066 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.