- రెన్యూవల్ పేరుతో వసూలు
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్,వెలుగు: ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 7 సెల్ఫోన్లు, 2 ల్యాప్ టాప్ లు,6 ఏటీఎం కార్డులు, 6 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లరి పవన్ కుమార్(27), కర్నూలుకు చెందిన సౌద్రి బస్వరాజ్(27) ఆన్లైన్ మోసాలకు ప్లాన్ చేశారు. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన పాలసీ హోల్డర్ల వివరాలను సేకరించారు. నిజమైన ఇన్సూరెన్స్ కంపెనీ తరహాలో నకిలీ కస్టమర్ కేర్ను ప్రారంభించారు.
టెలీ కాలర్స్ను నియమించుకున్నారు. వీరితో పాలసీ హోల్డర్లకు కాల్స్ చేసేవారు. తాము చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ కేర్ నుంచి కాల్స్ చేస్తున్నామని నమ్మించేవారు. పాలసీకి చెందిన వివరాలను తెలిపేవారు. పాలసీ రెన్యూవల్ చేసుకోవాలని డబ్బులు వసూలు చేసేవారు. ఇలా హైదరాబాద్కు చెందిన ఓ పాలసీ హోల్డర్ వద్ద గతేడాది రూ.1.88లక్షలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.