
హైదరాబాద్, వెలుగు: నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుపై 2 వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం స్కూళ్లల్లోని 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సి ఉందని, ఈ సీట్ల కేటాయింపుపై స్కూళ్ల వారీగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 3వారాలకు వాయిదా వేసింది.
నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది యోగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2009లో చట్టం వచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చేయట్లేదని పిటిషనర్ తరఫులాయర్ వాదించారు. చట్టంలోని సెక్షన్ 21(1)సీ ప్రకారం స్కూళ్లల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉందన్నారు. ఈ చట్టం అమలుపై కర్నాటక ప్రభుత్వం నిబంధనలు తెచ్చిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం 2010, జులై 7న జీవో44ను జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఇటీవలే ఆ స్టేను తొలగించిందన్నారు.