
హైదరాబాద్ : తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాజా ముజీబుద్దీన్ కనబడటం లేదని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. గత నాలుగు నెలలుగా కార్యాలయానికి రావడం లేదని, ఆయన మిస్సింగ్ అయ్యారంటూ సూఫీ ఉలేమా కౌన్సిల్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ ఉర్దూ భాష దినోత్సం సందర్భంగా ఉర్దూ అకాడమీలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూ భాషపై అవగాహన లేని వ్యక్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు.
కార్యాలయానికి చైర్మన్ ఖాజా ముజీబుద్దీన్ రాకపోవడం వల్ల పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆచూకీ తెలపాలని అబిడ్స్ పోలీసులను కోరారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా.. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్లో కార్యాలయానికి రావడం లేదన్నారు.