
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఆర్థిక సాయం పొందే విద్యా సంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనున్నట్లు వికలాంగుల ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గరిష్ట వయో పరిమితిని ఐదేండ్లు పెంచే జీవో కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు.
గురువారం మలక్ పేటలోని వికలాంగుల శాఖ ఆఫీసులో వీరయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగుల పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. విద్య ద్వారానే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అనే ఆలోచనతో ఉన్నారని త్వరలోనే విద్యలో రిజర్వేషన్లపై జీవో ఇవ్వనున్నారన్నారు.