క్యాస్ట్​, ఇన్​కమ్ .. సర్టిఫికెట్ల కోసం బారులు .. మీసేవా కేంద్రాల వద్ద వారం నుంచి భారీ క్యూ

క్యాస్ట్​, ఇన్​కమ్ .. సర్టిఫికెట్ల కోసం బారులు .. మీసేవా కేంద్రాల వద్ద వారం నుంచి భారీ క్యూ
  • గవర్నమెంట్​ పథకాలకు అవసరమని భావించి ఎగబడుతున్న జనం

నిజామాబాద్, వెలుగు: క్యాస్ట్, ఇన్​కమ్​సర్టిఫికెట్ల కోసం జిల్లావాసులు పరుగులు పెడుతున్నారు. దరఖాస్తులు చేయడానికి మీ–సేవా సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. కాంగ్రెస్​గవర్నమెంట్​ ఇచ్చే పథకాలకు ఈ సర్టిఫికెట్లు అవసరమనే భావనతో ఒకరిని చూసి మరొకరు అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలు దరఖాస్తులు వస్తున్నాయి.

సద్దులు కట్టుకొని మరీ క్యూలో..

కాలేజీల అకాడమిక్​ఇయర్ ​మొదలయ్యేటప్పుడు స్టూడెంట్స్​ఈ సర్టిఫికెట్ల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దని త్వరగా సర్టిఫికెట్లు జారీ చేయడానికి తహసీల్దార్ ​ఆఫీసుల్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా వాటిని స్టూడెంట్స్​కి అందిస్తారు. ఆ తర్వాత వీటికోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావు. కానీ సరిగ్గా వారం రోజుల నుంచి జిల్లాలో క్యాస్ట్, ఇన్​కమ్ ​సర్టిఫికెట్ల కోసం వేలాదిగా అప్లికేషన్లు వస్తున్నాయి.

వచ్చిన దరఖాస్తుల ఎంక్వయిరీకే అధిక టైమ్ ​కేటాయించాల్సి వస్తోందని ఆఫీసర్లు వాపోతున్నారు. సిటీలో నాలుగు తహసీల్దార్​ఆఫీస్​లు ఉండగా రోజుకు నాలుగు వేలకు తగ్గకుండా అప్లికేషన్లు వస్తున్నాయి. బోధన్, ఆర్మూర్, భీమ్​గల్ టౌన్​లలోనూ ఇదే మాదిరి రద్దీ ఉంటోంది. మీ–సేవా సెంటర్లు​ఓపెన్​ చేయకముందే జనాలు క్యూ కడుతున్నారు. పనిముగిసే దాకా ఉండడానికి సద్దులు కట్టుకొని మరీ వస్తున్నారు. ఎలక్షన్ ​టైమ్​లో కాంగ్రెస్ ​ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో గృహలక్ష్మి కింద ఇండ్లు, మహాలక్ష్మి పథకం పింఛన్,​ స్వయం ఉపాధి లోన్​లకు క్యాస్ట్, ఇన్​కమ్ ​సర్టిఫికెట్లు కావాలని నమ్మి పోటెత్తుతున్నారు.

ముందు జాగ్రత్తలో భాగంగా..

ఎలక్షన్​కు ముందు అప్పటి బీఆర్ఎస్​ గవర్నమెంట్​ఆగస్టులో బీసీ, దళిత బంధు పథకాలను ప్రకటించి, దరఖాస్తులు చేయడానికి గడువు కూడా సరిగా ఇవ్వలేదు. ఆయా పథకాలకు దరఖాస్తు చేయాలంటే క్యాస్ట్, ఇన్​కమ్​ సర్టిఫికెట్లు తప్పనిసరి అని చెప్పడంతో ఆయా సర్టిఫికెట్ల కోసం జనాలు వేల సంఖ్యలో క్యూకట్టారు. వీటిని పొందలేని చాలా మంది ఆయా పథకాలకు అప్లయ్ ​చేసుకోలేకపోయారు.

ఇప్పుడలాంటి పరిస్థితి ఏర్పడకుండా  స్కీమ్​ల మంజూరుకు గవర్నమెంట్​ఎప్పుడు అడిగినా సర్టిఫికెట్లు ఇచ్చేలా ముందుగానే వీటిని పొందాలనే ఆరాటపడుతున్నారు. రూ.500లకు వంట గ్యాస్ ​సిలిండర్ ​పొందడానికి ఈకేవైసీ చేయించాలనే భ్రమతో ఇప్పటికే గ్యాస్​ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్​ఉజ్వల్ ​యోజన కింద పేద కుటుంబాలకు ఇచ్చిన గ్యాస్​ కనెక్షన్​కు సంబంధించి ఈకేవైసీ తీసుకోడానికి ఈనెలాఖరు గడువు విధించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్​తో ఆగిన ఈకేవైసీ పది రోజుల నుంచి పున:ప్రారంభమైంది. ఇది అందరూ చేయించుకోవాలనే భ్రమతో జిల్లాలోని అన్ని గ్యాస్​ ఏజెన్సీల జనం క్యూ కడుతున్నారు. అదనంగా క్యాస్ట్, ఇన్​కమ్​ సర్టిఫికెట్ల రద్దీ కొనసాగుతోంది. 

ఎప్పుడడిగినా ఇవ్వడానికి.. 

ఇప్పుడే ఈ సర్టిఫికెట్లు అవసరమని భావించి దరఖాస్తు చేయలే. సర్కారు ఎప్పుడడిగినా ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకోవాలన్నదే ఆలోచన. సాధారణ టైమ్​లో తీసుకొని పెట్టుకోవడం ఉత్తమమని భావించి అప్లికేషన్ పెట్టిన. మున్మందు టెన్షన్​పడొద్దని ఆలోచనతో ప్రజలు దరఖాస్తులు పెడుతున్నారు. – నారాయణ, అప్లికెంట్​

చెప్పినా వినడం లేదు

ఏరోజుకారోజు క్యాస్ట్, ఇన్​కమ్​ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఆకస్మాతుగా వీటికి ఇంత డిమాండ్​ ఎందుకొచ్చిందనే సంగతి మొదట మాకు అర్థం కాలే. ఆఫీసర్లను అడిగినా గవర్నమెంట్​ ఆదేశాలేవీ లేవని చెప్పారు. వందల సంఖ్యలో దరఖాస్తు చేయడానికి వస్తున్న వారికి చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు.  
సునీత, మీసేవా సెంటర్​యజమాని