యూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం : మంత్రి పొన్నం ప్రభాకర్

యూనియన్ ఎన్నికల  తర్వాతే ఆర్టీసీ విలీనం :   మంత్రి పొన్నం ప్రభాకర్

బాన్సువాడ, వెలుగు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ముందుగా ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించి, భవిష్యత్ లో ఎలాంటి సమస్య ఎదురు కాకుండా చూసిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. భవిష్యత్ లో ప్రభుత్వ సంస్థ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, ఆర్థికంగా కుదుటపడ్డాక అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి ప్రాధాన్యతగా ప్రయాణికుల సంక్షేమం, రెండో ప్రాధాన్యతగా కార్మికుల సంక్షేమం, మూడో ప్రాధాన్యంగా మౌలిక వసతుల కల్పన చేపట్టామన్నారు. 

ఎస్ ఐఆర్ లో ఒక్క అర్హుడి ఓటును కూడా పోనివ్వబోమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది తటస్థ ఓటర్లు ఉన్నారన్నారు. రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, దానికి ఒక ప్రత్యేక శాఖ ఉంటుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలకు కూడా ప్రతిపక్ష నాయకులు జోకులు వేస్తున్నారని మండిపడ్డారు. సాగులో రసాయన ఎరువులు తక్కువగా వాడాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పీ సురేష్ షెట్కర్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున ఆలే పాల్గొన్నారు.