ధరలు దిగొచ్చాయ్!..రికార్డు స్థాయి కనిష్టానికి ద్రవ్యోల్బణం

ధరలు దిగొచ్చాయ్!..రికార్డు స్థాయి కనిష్టానికి ద్రవ్యోల్బణం
  • గత నెల 0.25 శాతంగా నమోదు
  • మరోసారి వడ్డీరేట్ల కోతకు చాన్స్​

న్యూఢిల్లీ: ధరల దడ రికార్డు స్థాయిలో తగ్గింది. జీఎస్టీ దిగిరావడం, కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు తక్కువగా ఉండటంతో గత నెల రిటైల్​ ద్రవ్యోల్బణం 0.25 శాతంతో రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. దాదాపు 380 నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించారు. 2012 బేస్​ఇయర్​ తరువాత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. సెప్టెంబర్​లో ద్రవ్యోల్బణం 1.44 శాతం ఉండగా, 2024 అక్టోబర్​లో ఇది 6.21 శాతం ఉంది.

నేషనల్​ స్టాటిస్టిక్స్​ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) డేటా ప్రకారం, గత నెల ఆహార ద్రవ్యోల్బణం (-–) 5.02 శాతానికి తగ్గింది. జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రభావం, సానుకూల బేస్​ ఎఫెక్ట్​, నూనెలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చెప్పులు,  ధాన్యాలు ఉత్పత్తులు, రవాణా కమ్యూనికేషన్​ ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రధాన (హెడ్​లైన్​) ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

 ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద ఉండాలని, ఇరువైపులా 2 శాతం మార్జిన్​తో ఉండేలా చూడాలని రిజర్వ్​ బ్యాంకును ప్రభుత్వం ఆదేశించింది. ఆర్​బీఐ​ తన ద్రవ్య విధానంలో ప్రధానంగా రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. జీఎస్టీ తగ్గిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.

గ్రామాల్లో చాలా తక్కువ

ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 0.25 శాతంతో నెగెటివ్​ జోన్​లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా ఉంది. అత్యధిక ద్రవ్యోల్బణం కేరళలో (8.56 శాతం) ఉంది. జమ్మూ కాశ్మీర్​లో 2.95 శాతం, కర్ణాటకలో 2.34 శాతం, పంజాబ్​లో 1.81 శాతం, తమిళనాడులో 1.29 శాతంగా ఉంది. అస్సాం, బీహార్, ఛత్తీస్​గఢ్​, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​తో సహా పలు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం నెగెటివ్​గా ఉంది. 

ఇక్రా చీఫ్​ ఎకనామిస్ట్​ అదితి నాయర్​ మాట్లాడుతూ, ఆహార ధరలు పడిపోవడం, అనేక వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు వలన ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) 2026 ఆర్థిక సంవత్సరం సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి మరింత తగ్గించే అవకాశం ఉందని అన్నారు. రెండో క్వార్టర్​లో జీడీపీ వృద్ధి ఊహించని విధంగా పెరగకపోతే,  వడ్డీ రేట్లు 25 బేసిస్​పాయింట్ల వరకు తగ్గవచ్చని ఆమె తెలిపారు. 

ఎంపీసీ తదుపరి సమావేశం డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరగనుంది. సెప్టెంబర్​ చివర్లో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం అక్టోబర్​లో కనిపించిందని కేర్​ఎడ్జ్​ రేటింగ్స్​ చీఫ్​ ఎకనామిస్ట్​ రజనీ సిన్హా అన్నారు.