పోరాడే శక్తి లేదు..బకాయిలు చెల్లించండి : ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్

పోరాడే శక్తి లేదు..బకాయిలు చెల్లించండి : ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్
  •     ఆర్టీసీ రిటైర్డ్​ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
  •     సీనియర్ సిటిజన్స్ ఫోరం విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఎన్‌‌క్యాష్‌‌మెంట్, గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ ఫోరం డిమాండ్ చేసింది. 2017 రివైజ్డ్ పే స్కేల్ బకాయిలు కూడా చెల్లించాలని కోరింది. మంగళవారం హైదరాబాద్​లోని రాంనగర్ లలితనగర్ కమిటీ హాల్‌‌లో ఫోరం అధ్యక్షుడు ఎంవీ కృష్ణ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. 

గౌరవ అధ్యక్షుడు బి.సుధాకర్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు పోరాటం చేసే శక్తి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2014 సెప్టెంబర్‌‌కు ముందు రిటైర్ అయిన వారికి హయ్యర్ పింఛన్​ మంజూరు చేయాలని కోరారు.