నడుచుకుంటూ వచ్చిన రేవంత్.. సిట్ వద్ద హైడ్రామా

నడుచుకుంటూ వచ్చిన రేవంత్.. సిట్ వద్ద హైడ్రామా

సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అంతకుముందు.. సిట్ కార్యాలయానికి లిబర్టీ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న ఆధారాలతో రేవంత్ రెడ్డి.. సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం రేవంత్ ని విచారిస్తున్నారు. 

హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకురాలు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లను తోసేసి సిట్ ఆఫీస్ వైపునకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ముందస్తు అరెస్ట్ లు 

హిమాయత్ నగర్ లో ఉన్న సిట్ ఆఫీసుకు రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో.. పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. TSPSC పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మార్చి 23వ తేదీన సిట్ ఎదుట హాజరై.. TSPSC పేపర్ లీకేజీపై పలు ఆధారాలను రేవంత్ రెడ్డి అందించనున్నారు. 

హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీస్ కు వెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు. 

రేవంత్ రెడ్డి సిట్ ముందు హాజరవుతుండటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే లింగోజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్రపై విచారణ చేయకుండా... ప్రతిపక్ష పార్టీ నాయకులను విచారణ కు పిలవడం ఏంటని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.