- గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున రూ.450 కోట్లు విడుదల
- ప్రస్తుతం ఏటా సగటున రూ.850 కోట్లు రిలీజ్
- ఆన్లైన్ విధానంతో పారదర్శకతకు పెద్ద పీట
- 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు సీఎంఆర్ఎఫ్ పంపిణీ ఇలా..
- మొత్తం పంపిణీ1,685.79 కోట్లు
- మొత్తం లబ్ధిదారులు3,76,373 మంది
- రీయింబర్స్మెంట్ వాటా1,152.10 కోట్లు
- ఎల్వోసీ వాటా533.69 కోట్లు
హైదరాబాద్, వెలుగు: గతంతో పోలిస్తే సీఎంఆర్ఎఫ్ సాయం విడుదల రెండింతలైంది. ప్రభుత్వం గత రెండేండ్లలో (2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6) ఏకంగా రూ.1,685.79 కోట్ల ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో పదేండ్లలో (2014 నుంచి -2023) ఏటా సగటున రూ.450 కోట్ల సాయం అందించగా.. ప్రస్తుతం ఏటా సగటున రూ.850 కోట్లు అందిస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నది. ప్రధానంగా రెండు విధానాల్లో ప్రభుత్వం బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నది. ఇందులో ఒకటి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ). ఇందులో భాగంగా నిమ్స్, ఎంఎన్జే, ప్రభుత్వ ఈఎన్టీ వంటి ఆసుపత్రుల్లో చికిత్స కోసం సర్కార్ ముందుగానే హామీ పత్రం (ఎల్వోసీ) జారీ చేస్తుంది. దీంతో బాధితులు ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ట్రీట్మెంట్ పొందవచ్చు.
ఇక రెండో విధానంలో బాధితులు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం బిల్లులు చెల్లించి.. ఆ మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి పొందవచ్చు. సీఎంఆర్ఎఫ్లో గతంలో ఉన్న దళారీ వ్యవస్థకు ప్రభుత్వం చెక్ పెట్టింది. దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోకి మార్చింది. మోసాలకు తావులేకుండా ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. చెక్కుల మీద లబ్ధిదారుడి పేరుతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్ను కూడా ముద్రిస్తున్నది.
ఆస్పత్రుల బలోపేతానికే ఎల్వోసీలు..
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎల్వోసీలను మంజూరు చేస్తున్నది. కార్పొరే ట్, ప్రైవేట్ఆసుపత్రులకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యమిస్తున్నది. ముఖ్యం గా నిమ్స్ ఆసుపత్రికి అత్యధికంగా 26,694 ఎల్వోసీలు మంజూరు చేసింది. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి 316, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో (పిల్లలకు వినికిడి యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం) 196 ఎల్ఓసీలు జారీ చేసింది.
కాగా, వార్షిక ఆదాయం రూ.1.60 లక్షల లోపు (తెల్ల రేషన్ కార్డు) ఉన్నోళ్లు సీఎంఆర్ఎఫ్కు అర్హులు. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లేదా ఎంపీ సిఫార్సు లేఖ, ఆసుపత్రి బిల్లులు/అంచనా పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ ఇవ్వాలి. సెక్రటేరియెట్లోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయం లేదా 040–-23455662 నంబర్లో సంప్రదించవచ్చు.

