
హైదరాబాద్: కాంగ్రెస్ లో చెరుకు సుధాకర్ ను చేర్చుకోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని రేవంత్ తీరుపై మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడుకు వెళ్తా అన్నారు. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని.. ఇకపై ఆయన ముఖం కూడా చూడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఎంపీ కోమటిరెడ్డి తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని పార్టీ అధినేత్రికి లేఖద్వారా వివరించారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తనకు క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ముసలం కొనసాగుతుండగానే.. చెరుకు సుధాకర్ కాంగ్రెస్ చేరిక వ్యవహారం ఆ పార్టీలో అగ్గి రాజేసినట్లైందని మునుగోడు ప్రజలు చర్చించుకుంటున్నారు.