పొలిటికల్ యాక్టివిటీస్, ప్రకటనలు లేకుండా ఆధ్యాత్మికతకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
బాసర మాస్టర్ప్లాన్పై అధికారులతో రివ్యూ6న రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు అమలు చేయండి.. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు, సమావేశాలు, ప్రకటనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయండి’’ అని సూచించారు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం శనివారం రివ్యూ నిర్వహించారు.
తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయమవుతుందని వెల్లడించారు. మాస్టర్ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని, భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్తులో భారీ వృక్షాలతో ఉండేలా అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ను నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా ఉండేలా చూడాలన్నారు.
పనుల నాణ్యతలో రాజీపడొద్దు..
ఎంతటి ప్రముఖుల వెహికల్స్ అయినా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని, ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారా చేరుకునేలా చూడాలని సీఎం రేవంత్ సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 6న ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
