ప్రతీ ఒక్కరు కీర్తించాల్సిన వ్యక్తి పీవీ

ప్రతీ ఒక్కరు కీర్తించాల్సిన వ్యక్తి పీవీ

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని కీర్తించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీవీ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ కారణమన్నారు. భూ సంస్కరణలు తెచ్చి..భూమి లేని పేదలకు భూమి ఇచ్చారని ఆయన కొనియాడారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు. పీవీ ప్రతీ ఒక్కరు కీర్తించాల్సిన వ్యక్తి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 

మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో పీవీ సేవలు మరవలేనివి అని రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత జైపాల్ రెడ్డి పీవీ అడుగుల్లో నడిచారని చెప్పారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఈ జాతి సంపద.. ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అని కీర్తించారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని తెలిపారు. కాగా, పీవీ గ్రామం వంగరలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని.. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రేవంత్ పేర్కొన్నారు.