10 రోజులు ఓపిక పట్టండి.. రైతు బంధు రూ.15 వేలు వేస్తాం : రేవంత్ రెడ్డి భరోసా

10 రోజులు ఓపిక పట్టండి.. రైతు బంధు రూ.15 వేలు వేస్తాం : రేవంత్ రెడ్డి భరోసా

మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేయటంపై.. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. 2023, నవంబర్ 27వ తేదీ ఈ మేరకు ఎక్స్ లో కామెంట్ చేశారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, అత్రుత, అహంకారం తప్ప.. నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా, అల్లుళ్లకు లేదంటూ కేసీఆర్, హరీశ్ రావుల వైఖరిని తప్పుబట్టారు రేవంత్ రెడ్డి.

మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంటున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటమే ఇందుకు నిదర్శనంగా స్పష్టం చేశారు  రేవంత్ రెడ్డి. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారాయన. 

రైతు బంధు నిలిచిపోవటంపై తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దని.. 10 రోజులు ఓపిక పడితే.. కాంగ్రెస్ రాగానే 15 వేల రూపాయల రైతు భరోసాను బ్యాంక్ ఖాతాల్లో వేస్తాం అని హామీ ఇచ్చారు.. భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.