ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసింది : రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసింది : రేవంత్ రెడ్డి

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీ హామీలను ప్రకటించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ పీసీసీ విజ్ఞప్తి మేరకు CWC సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా సెప్టెంబర్16,17, 18 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ చేయబోయే కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

సెప్టెంబర్17వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.17న నిర్వహించే సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీ పథకాలను ప్రకటిస్తారని చెప్పారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్  దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని చెప్పారు. 17వ తేదీన సోనియాగాంధీ ఇచ్చే 5 గ్యారంటీ స్కీమ్ లను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటామన్నారు. 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు అనుమతి కోసం సెప్టెంబర్ 2వ తేదీనే డిఫెన్స్ వారికి లేఖ ఇచ్చామన్నారు. 

సభ నిర్వహించుకునేందుకు పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్ లో సభ పెడతామంటూ కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వమే కుట్రదారుగా మారడం దారుణం అన్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రెండవ ఆప్షన్ గా ఎల్బీ స్టేడియాన్ని అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేసి.. అనుమతి ఇవ్వకున్నా.. బహిరంగ సభను వాయిదా వేసేది లేదని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ ఏర్పాటు చేస్తామన్నారు.