
రాష్ట్రాన్ని బీహార్ ముఠా ఆక్రమిస్తోందని, ఇతర రాష్ట్రాల IAS,IPSకు తెలంగాణలో ప్రాధాన్యం ఇస్తున్నారని, స్థానికులకు అప్రాధాన్య పోస్టులు కట్టబెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీకుమార్, ఆరు శాఖలు కలిగిన మునిసిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్, ఎనిమిది శాఖలున్న సందీపకుమార్ సుల్తానియా బీహార్ నుంచి వచ్చారని, వీరందరూ కాకుండా.. సీఎం కేసీఆర్ కు సలహాలు ఇవ్వడానికి కొత్తగా ప్రశాంత్ కిశోర్ను బీహార్ నుంచి తెచ్చుకున్నారని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నిర్వహణపై ఆర్టీసీ కల్యాణ మండపంలో సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వందమంది ప్రశాంత్ కిశోర్లు, వెయ్యి మంది ప్రకాశ్రాజ్లు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ గెలవలేరని, ప్రజలు గెలవనీయరని అన్నారు. కేసీఆర్ ముత్తాతలు బీహార్ నుంచి వచ్చారని, ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తమ పూర్వికులది బీహారేనని చెప్పారని తెలిపారు. అద్భుతమైన ఆలోచనలతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ .. దేశానికి ఆదర్శంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారని, అలాంటప్పుడు.. ప్రశాంత్ కిశోర్ను ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు గులాంగిరి చేయలేనని పాలమూరు బిడ్డ ప్రవీణ్కుమార్.. రాజీనామా చేసి బయటకొచ్చారని అన్నారు. ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి తెలంగాణ బిడ్డేనని, ఆయన కూడా రాజీనామా చేసి బయటకు రావాలని సూచించారు. రాష్ట్రంలో 40 లక్షల కాంగ్రెస్ సభ్యత్వాలు చేస్తే.. ఒక్కొక్కరు ఒక్కో ఓటు తీసుకొస్తే 80 లక్షల ఓట్లు వస్తాయని, దాంతో 90 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని, 12 నెలల తర్వాత కాంగ్రెస్ సర్కార్ వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పార్టీ సభ్యత్వమున్నవారికే మొదటి ప్రాధన్యమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 38.20 లక్షల కాంగ్రెస్ సభ్యత్వం పూర్తయిందని, బూత్లవారీగా సైనికులుగా సభ్యత్వం చేసేవారిని అభినందించడానికి, మిగతావారికి బాధ్యత గుర్తు చేయడానికి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..