టెంపుల్స్‌లో కరోనా ఆంక్షలు విధించిన దేవాదాయ శాఖ

టెంపుల్స్‌లో కరోనా ఆంక్షలు విధించిన దేవాదాయ శాఖ

వారం క్రితం వరకు దైవదర్శనానికి వచ్చే భక్తులపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఆలయాల్లో జరిగే అన్ని పూజలకు అనుమతి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎండోమెంట్ శాఖ ఆలయాల్లో ఆంక్షలు  విధించింది. ఆలయాల్లో భక్తులను కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతించాలంటూ ఆదేశాలిచ్చింది. 10 ఏళ్ళ లోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వృద్దులకు ఆలయాల్లోకి అనుమతి లేదు. ప్రతి టెంపుల్‌లో మాస్క్ పెట్టుకున్న భక్తులకు... థర్మల్ స్కానింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతిస్తారు.  

హైదరాబాద్ సిటీలో వందల ఆలయాలు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. పెద్ద టెంపుల్స్ అయిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహాకాళి అమ్మవారు, కనకాల కట్టమైసమ్మ, సికింద్రాబాద్ గణపతి ఆలయం, కర్మన్ ఘాట్  హనుమాన్ టెంపుల్, కొత్త పేట అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం, ముషీరాబాద్ దుర్గ గుడితో పాటు మిగతా ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హుండీ ఆదాయం కూడా ఒక్కో టెంపుల్‌లో నెలకు 10 లక్షల పైనే ఉంటుంది. 

గత ఏడాది లాక్ డౌన్ వల్ల దాదాపు రెండు నెలలకు పైగా ఆలయాలు క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత తెరుచుకున్నా.. భక్తులు పరిమిత సంఖ్యలోనే ఆలయాలకు వెళ్తున్నారు. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో... దేవాదాయ శాఖ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. రెండు వారాల క్రితం వరకూ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. మళ్ళీ కరోనా భయానికి భక్తుల సంఖ్య తగ్గుతోంది.  దాంతో చిన్న ఆలయాల ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడనుంది.

ఆలయాల్లో శాఠారి, తీర్థప్రసాదాలు, అన్నదానాలు నిలిపివేశారు. అర్చనలు, వాహన పూజలు, అభిషేకాలు, ప్రత్యేక  పూజల్లో భక్తులకు  ప్రత్యక్షంగా అనుమతి  లేదు. ఆన్ లైన్‌లో మాత్రమే అవకాశం  కల్పించారు. ప్రసాదాలు  కూడా పోస్ట్ ఆఫీసుల్లోనే బుక్ చేసుకోవాలంటున్నారు. ఆలయాల్లోని బోనాల కాంప్లెక్స్, ఫంక్షన హాల్స్‌పై ఎలాంటి ఆంక్షల్లేవు. ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా బ్లాక్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు, ఆలయ ఆవరణను తరుచుగా శానిటైజ్  చేస్తున్నారు. కరోనా  వైరస్‌పై భక్తుల అవగాహన కోసం ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు.