
- కబ్జాల నుంచి కాపాడేందుకురాష్ట్ర సర్కార్ నిర్ణయం
- డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు
- రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీగా ఆక్రమణలు
- కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్స్ను చెరబట్టిన అక్రమార్కులు
- నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా
- పోరంబోకు, ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు.. ఏదీ వదలలే
- వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం
- సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని.. వాటి చుట్టూ ఫెన్సింగ్ (ప్రహరీగోడ) నిర్మించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. ఈ చర్యలు.. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా నివారించడానికి తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రణాళికను త్వరలోనే అమలు చేయనున్నారు.
ఆ మూడు జిల్లాల్లో భారీగా కబ్జాలు
రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజ్గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కబ్జాల సమస్య తీవ్రంగా ఉంది. పట్టణీకరణ వేగవంతం కావడంతో, ఈ జిల్లాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకొని, వందల ఎకరాలను కబ్జా చేశారు. ప్రభుత్వానికి చెందిన పోరంబోకు, వాగులు, చెరువులు, ఖాళీ స్థలాలు ఇలా ఏది దొరికితే దాన్ని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నది. రియల్ ఎస్టేట్ విలువలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ భూముల కబ్జాలు తీవ్రమయ్యాయి. ఈ జిల్లాల్లో కోట్ల రూపాయల విలువ చేసే వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వల్ల ఈ భూముల్లో వందల ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, లేదా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా కబ్జాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములు కాకుండా వివిధ రకాల ప్రభుత్వ భూములు 16 లక్షల ఎకరాలు పైనే ఉన్నాయి. ఈ లెక్కలపైన కూడా స్పష్టత లేదు.
జియో ట్యాగింగ్ ఇట్ల..!
మొదట ప్రభుత్వానికి చెందిన భూములను గుర్తించి, వాటి సరిహద్దులను అధికారులు స్పష్టంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పద్ధతులను ఉపయోగిస్తారు. ప్రభుత్వ భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించడానికి డిజిటల్ సర్వే నిర్వహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూభాగాన్ని జియో ట్యాగ్ చేస్తారు. ప్రతి ప్రభుత్వ భూమికి ఒక ప్రత్యేకమైన జియో కోడ్ కేటాయిస్తారు. ఈ కోడ్ను ఉపయోగించి.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహాయంతో ఆ భూమి ఎక్కడ ఉందో, దాని విస్తీర్ణం ఎంత, దాని చుట్టూ ఉన్న ఇతర ఆస్తులు ఏమిటి అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే, జియో ట్యాగింగ్ ద్వారా దాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఇది కబ్జాదారుల ప్రయత్నాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల భూముల భౌగోళిక సమాచారం డిజిటల్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది. క్షేత్రస్థాయిలోని, డిజిటల్ మ్యాప్లోని కొలతలకు అంగుళం కూడా తేడా ఉండదు. కబ్జాకు యత్నిస్తే ఆ చిత్రాలు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టుల్లో సాక్ష్యంగా ఉపయోగించి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీంతో భవిష్యత్తులో ఒకే బటన్తో ప్రభుత్వ భూముల వివరాలన్నీ తెలుసుకోవడంతో పాటు వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
ఫెన్సింగ్తో పాటు‘ఇది ప్రభుత్వ భూమి’ అని బోర్డులు
జియో ట్యాగ్ చేసిన భూముల చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీగోడ నిర్మించాలని రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ ఫెన్సింగ్పై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని సూచించే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల.. భూమిని కొనడానికి ప్రయత్నించే అమాయకులకు కూడా ఈ భూమి ప్రభుత్వానిదని తెలుస్తుంది. ఆక్రమణదారులు భూమిలోకి అడుగు పెట్టకుండా నివారించవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ప్రభుత్వ భూములను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించవచ్చు. ఈ ప్రణాళికను త్వరలోనే అమలు చేయనున్నారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని జిల్లాల్లో ప్రారంభించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు.
సర్వే చేస్తేనే సర్కార్ భూములపై క్లారిటీ
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ పరిధితో పాటు వివిధ శాఖల కింద ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని డిజిటట్ సర్వే చేస్తే ప్రభుత్వం కింద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయనేది తేలుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. రికార్డుల పరంగా, పోర్టల్ పరంగా భూముల లెక్కల్లో గందరగోళం నెలకొంది. రెండింటికీ పొంతన కుదరడం లేదు. దీంతో ప్రతి ప్రభుత్వ భూమిని సర్వే చేస్తే ఎంత విస్తీర్ణం ఉంది? ఎంత కబ్జాకు గురైంది? ఏ శాఖ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తేలుతుంది. అందులోనూ నిర్మాణాల్లో ఎంత ఉంది? నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ల్యాండ్ వివరాలు ఏమిటి? అనే వివరాలు బయటకు వస్తాయని.. దీంతో భవిష్యత్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్త పడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
కొన్ని చోట్ల ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!
- రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామ పరిధిలో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. ఈ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కూడా చేపట్టారు. నకిలీ పత్రాలను గుర్తించిన ప్రభుత్వం.. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఇటీవల కూల్చివేసింది. ఈ భూమి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శాతమ్రాయి గ్రామంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్టుకు చెందిన 11 ఎకరాల భూములను స్థానిక రియల్టర్ కంపెనీ (అనీష్ కన్స్ట్రక్షన్స్), రాజకీయ నాయకుడు కలిసి కబ్జా చేసి, అసఫ్ జాహీ వారసుల నుంచి కొనుగోలు చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. ఇటీవల ప్రభుత్వం స్థానికుల ఫిర్యాదులతో అక్కడ తాత్కాలిక నిర్మాణాలను తొలగించి.. తిరిగి స్వాధీనం చేసుకున్నది.
- రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురైంది. చివరికి స్థానికులు కోర్టుకు వెళ్లడంతో.. రక్షించాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది.
- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ప్రభుత్వ భూములను, ముఖ్యంగా దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)కు చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఫామ్హౌస్లు, వెంచర్లు కూడా వేయడానికి ప్రయత్నించారు. ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ల్యాండ్స్ చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి, హద్దులను స్పష్టంగా గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.
- మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ కీసరగుట్ట శివాలయం, శామీర్పేటలోని నరసింహస్వామి ఆలయానికి చెందిన వందల ఎకరాల దేవాదాయ భూములు కబ్జా అయ్యాయి. ఈ భూములను నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ పట్టాలతో ప్రైవేట్ వ్యక్తులు తమ పేరు మీద మార్చుకున్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ భూములపై సర్వే నిర్వహిస్తున్నాయి. నకిలీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి.. భూములను ఆలయాలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాయి.