హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ‘‘గత ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులను బయటకు లీక్ చేస్తారని ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఉద్యోగికి ఒకటో తేదీ నుంచి 5 లోపే జీతం పడేలా చూస్తం” అని చెప్పారు. ఆదివారం బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వంలో వ్యక్తి స్వేచ్ఛను హరించారు. సామాన్యుడే కాదు.. ఏ ఉద్యోగి కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఒక్కరో ఇద్దరో తప్పు చేస్తే మిగతా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. కనీసం ప్రజలు చెప్తున్న దాన్ని వినే వ్యవస్థ గ్రామ స్థాయిలో లేకుండా చేశారు. కొన్ని వందల ఏండ్ల నుంచి భూములను కాపాడుతూ వస్తున్న రెవెన్యూ ఉద్యోగులను కాదని, ధరణిని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం భూములను తమ తొత్తులకు కట్టబెట్టింది” అని ఆరోపించారు.
భూములను కోల్పోయినోళ్లకు న్యాయం చేస్తం
ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా రెవెన్యూ సెక్టార్ ఉద్యోగులు ఉంటారని మంత్రి పొంగులేటి అన్నారు. అయితే ఈ కమ్యూనికేషన్ని ప్రభుత్వ పక్షాన వినే వాళ్లు లేరని, గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం టోటల్ గా ఎత్తేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ‘‘ధరణి అనే ఒక పోర్టల్ను తీసుకొచ్చి ప్రజలను కొత్త ఇబ్బందులకు గురిచేశారు. సంస్కరణల పేరుతో వక్రమార్గంలో తెచ్చిందే ధరణి. ధరణిలో ఉన్న లొసుగులను, ధరణిలో గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తం. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలన్నింటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నది. ధరణిని ప్రక్షాళన చేసి, తప్పులను గుర్తించి, భూములను కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం” అని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు.