హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైస్ మిల్లర్లు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులు మూతపడే పరిస్థితి నెలకొంది. 13 ప్రధాన డిమాండ్లతో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు మిల్లర్ల సంఘాలు ప్రకటించాయి. సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లులపై విజిలెన్స్ దాడులు, కేసులు నిలిపివేయాలని, పెనాల్టీ, వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులు కలిపి దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. ఇందులో వందలాది మిల్లులు సీఎంఆర్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడంతో డిఫాల్ట్ జాబితాలో చేరాయి. బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్), ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ) కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎంఆర్ బియ్యం తిరిగి ఇచ్చిన మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని మిల్లర్లు కోరుతున్నారు.
