
- ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో 88 వ స్థానం
- ఇండియా నుంచి 9 కంపెనీలకు చోటు
- టాప్ పొజిషన్లో వాల్మార్ట్, అమెజాన్
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో 88 వ స్థానం దక్కించుకుంది. కిందటేడాది లిస్ట్లో 86వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఇండియా నుంచి టాప్ కంపెనీగా కొనసాగుతోంది. 2021లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో 155వ స్థానం దక్కించుకున్న రిలయన్స్, గత నాలుగేళ్లలో 67 స్థానాలు మెరుగైంది. ఈ ఏడాది లిస్ట్లో వాల్మార్ట్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండగా, అమెజాన్ రెండో స్థానంలో ఉంది. టాప్ 10 కంపెనీల్లో చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ (3 వ ర్యాంక్), చైనా నేషనల్ పెట్రోల్ (5), సినోపెక్ గ్రూప్ (6) ఉన్నాయి. సౌదీ ఆరామ్కో (4), యాపిల్ (8) కూడా టాప్లో ఉన్నాయి. ఇండియా నుంచి 9 కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
5 పబ్లిక్ సెక్టార్, 4 ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఎల్ఐసీ 95వ స్థానంలో , ఐఓసీ 11 స్థానాలు కోల్పోయి 127వ స్థానంలో, ఎస్బీఐ 15 స్థానాలు మెరుగై 163వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 48 స్థానాలు ఎగసి 258వ స్థానంలో ఉన్నాయి. ఓఎన్జీసీ ఒక స్థానం కోల్పోయి 181వ స్థానంలో, టాటా మోటార్స్ 283వ స్థానంలో, బీపీసీఎల్ 285 వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ 464వ స్థానంలో ఉన్నాయి. రిలయన్స్ 22 ఏళ్లుగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో ఉంది. రూపాయి విలువ కిందటేడాది మార్చిలో 83.35 ఉంటే, ఈ ఏడాది మార్చిలో 85.45కు పడిపోయింది. ఫలితంగా డాలర్లలో రిలయన్స్ ఆదాయం ప్రభావితమైంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రికార్డు లెవెల్లో రూ.10.71 లక్షల కోట్ల గ్రాస్ రెవెన్యూ, రూ.1.83 లక్షల కోట్ల ఇబిటా (ట్యాక్స్, వడ్డీలకు ముందు ప్రాఫిట్) సాధించింది.