న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్కు గురైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ హెల్త్పై రోజుకో వార్త చక్కర్లు కొడుతున్నది. మోకాలు, చీలమండ లిగ్మెంట్ ఆపరేషన్ కోసం ముంబైకి ఎయిర్ లిఫ్ట్ చేసిన పంత్ను ఇప్పుడు లండన్ తీసుకెళ్లేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. అక్కడ పంత్ రెండు మోకాళ్లతో పాటు రెండు చీలమండలకు సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడన్న దానిపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ లండన్లో డబుల్ సర్జరీ జరిగితే పంత్ దాదాపు 9 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యాక్సిడెంట్లో అయిన గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు పంత్కు చికిత్స అందిస్తున్నారు. దీంతో పాటు లిగ్మెంట్ ఇంజ్యురీకి సంబంధించి డాక్టర్ దిన్షా పరిడివాలా ట్రీట్మెంట్ను కొనసాగిస్తున్నాడు.
వాస్తవానికి పంత్కు డాక్టర్ దిన్షా సర్జరీ చేస్తారని బీసీసీఐ ముందు ప్రకటించినా ఇప్పుడు వరల్డ్కప్ (అక్టోబర్) దృష్ట్యా ఆ రిస్క్ తీసుకోవడం లేదు. మెగా టోర్నీ వరకు పంత్ను ఆటకు రెడీ చేయాలని చూస్తున్న బోర్డు.. లండన్లో సర్జరీ చేయించేందుకు ప్లాన్స్ వేస్తోంది. ప్రస్తుతానికైతే పంత్ లిగ్మెంట్ గాయం తీవ్రత తెలియాలంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సి ఉంది. మరోవైపు పంత్ గైర్హాజరీలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను డేవిడ్ వార్నర్ నడిపించే చాన్స్ ఉంది. పంత్ కోలుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతుండటంతో కెప్టెన్సీ కోసం ఫ్రాంచైజీ వార్నర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. వికెట్ కీపర్గా సర్ఫరాజ్ ఖాన్కు బాధ్యతలు అప్పగించొచ్చు.