లండన్: దేశంలో అక్రమ వలసలను అడ్డుకోవడానికి ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో ప్రధాని రిషి సునక్ స్వయంగా పాల్గొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి అధికారులతో కలిసి అక్రమ వలసదారులను పట్టుకున్నారు. ఈ డ్రైవ్లో మొత్తం 105 మంది అక్రమ వలసదారులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ105 మంది 20 దేశాలకు చెందినవారని యూకే హోం ఆఫీస్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. నార్త్ లండన్లోని బ్రెంట్లో నిర్వహించిన రెయిడ్ లో ప్రధాని సునక్(43) బుల్లెట్ ప్రూఫ్ ధరించి అటెండ్ అయ్యారు. ఇమిగ్రేషన్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గతవారం తమ విధుల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించారు.
కాగా, బ్రిటిష్ ఇండియన్ లీడర్ రిషి సునక్ ఎన్నికలకు ముందు అక్రమ వలసలను అణచివేసేందుకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ మాట్లాడుతూ.. ఇల్లీగల్ వర్కింగ్ తమ కమ్యూనిటీలకు అపాయమని, హానెస్ట్ వర్కర్లకు పనిలేకుండా పోతున్నదన్నారు. పన్నులు కట్టకపోవడంతో ప్రభుత్వ ఖజానాపై దీని భారం పడుతోందని తెలిపారు. గురువారం యూకే దేశవ్యాప్తంగా 159 ప్రాంతాల్లో అధికారులు రెయిడ్ చేసి అక్రమంగా పనిచేస్తున్న 105 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వాణిజ్య ప్రాంతాల్లో జరిగిన అధికారుల దాడుల్లో అరెస్టయినవారిలో ఎక్కువగా రెస్టారెంట్లు, బార్బర్ షాప్స్, నెయిల్బార్స్, కార్ వాషింగ్, కిరాణా స్టోర్స్లో పనిచేస్తున్నారు.