- ఎన్హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూకు రియాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్ది బూటకపు ఎన్ కౌంటర్ అని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రిజాజ్ది కస్టోడియల్ డెత్ అని, ఆయన మరణించిన తర్వాత డెడ్బాడీలోకి బుల్లెట్లు దింపి ఎన్కౌంటర్గా చిత్రీకరించారన్నారు. ఈ విషయంలో పోలీసులు నిజాలు దాస్తున్నారని, అందువల్ల సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్చార్సీ), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్(ఎన్సీడబ్ల్యూ), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)కు లీగల్ యాక్టివిస్ట్ సయ్యద్ ఫిరాసత్ అలీ, సోషల్ యాక్టివిస్టులు ఖలీదా పర్వీన్, జలాదుద్దీన్, ఇతర ప్రజా సంఘాల నేతలతో కలిసి రియాజ్ తల్లి జరీనా బేగం, భార్య సనోబర్ నజ్జీన్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
రియాజ్ ఒక బైక్ సీజర్ అని, ఆయనపై 61 పిట్టీ కేసులు నమోదయ్యాని, ప్రమోద్ హత్య తర్వాతే మర్డర్ కేసు నమోదైందని రియాజ్ తల్లి, భార్య చెప్పారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారుగానీ, అందులో నిజం లేదన్నారు. రియాజ్ను థర్డ్ డిగ్రీ పేరుతో చింత హింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. రియాజ్ ను హాస్పిటల్ లోపలికి, బయటకు తీసుకెళ్లిన విజువల్స్, ఇతర ఏ సాక్ష్యాలను పోలీసులు చూపడం లేదన్నారు.
