నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ

నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన  ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ
  • ఆర్​ఎంపీ, పీఎంపీల ర్యాలీలో అనూహ్య ఘటన

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని డిచ్​పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ అశోక్​ను ఓ మహిళ సోమవారం నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. ట్రీట్​మెంట్​ కోసం వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు వ్యక్తిని వందల మంది చూస్తుండగా ఆగ్రహంతో బుద్ధి చెప్పింది.  ఆర్ఎంపీ, పీఎంపీలపై సర్కార్ ఆంక్షలు పెట్టిందని, సర్టిఫికెట్లు ఇచ్చి ట్రీట్​మెంట్​కు అనుమతించాలని, మెడికల్ కౌన్సిల్​ పెట్టిన పోలీస్​ కేసులు ఎత్తేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం నిజామాబాద్​ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పులాంగ్ చౌరస్తా నుంచి ఎన్​టీఆర్ చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో జిల్లావ్యాపంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు. 

ర్యాలీ పూర్తై యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా వచ్చిన మహిళ అశోక్​పై చెప్పుతో దాడి చేసింది. వైద్యం పేరుతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అశోక్ దుర్మార్గుడని ఆర్ఎంపీల సంఘానికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడని మండిపడింది. ఈ అనూహ్య ఘటనతో ర్యాలీలో పాల్గొన్న వందలాది మందితో పాటు అక్కడున్న పోలీసులు నిశ్చేష్ఠులయ్యారు. తనపై దాడి చేసిన మహిళపై యాక్షన్​ తీసుకోవాలని అశోక్​ వన్​ టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.